– రైతులకు పసుపు పంటపై అవగాహన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు రైతులు గురువారం సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా మహానంది ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది రైతు స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో కమ్మర్ పల్లి పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన రైతులకు పసుపు పంటపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు పంటపై జరుగుతున్న వివిధ పరిశోధనలు, ఆధునిక సాగు పద్ధతులు, పసుపు రకాల ప్రదర్శన (ఎగ్జిబిషన్), పంట ఉత్పత్తి పెంపు పద్ధతుల గురించి రైతులకు వివరించారు.
పసుపు ప్రాసెసింగ్కు ఉపయోగించే యంత్రాలను క్షేత్రస్థాయిలో రైతులకు చూపించి వాటి వినియోగంపై వివరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పసుపు పంట సాగులో నూతన సాంకేతికతలు, వ్యాధి నివారణ చర్యలు, మార్కెట్ అవకాశాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. పరిశోధన కేంద్రాన్ని సందర్శించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సందర్శనలో భాగంగా తాము నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతంలో అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రం అధికారులు, స్పైస్ బోర్డు ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
