అరచేతిపై సూసైడ్ నోట్తో వైద్యురాలి ఆత్మహత్య
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అంతులేని అరాచకాలు
ముంబయి : ఇద్దరు పోలీసు అధికారుల లైంగిక, మానసిక వేధింపుల కారణంగా మహారాష్ట్రలో ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇవ్వాలని, బూటకపు ఫిట్నెస్ రిపోర్టులు ఇవ్వాలంటూ ఇద్దరు పోలీసు అధికారులు తనను నెలల తరబడి శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె తన ఎడమ అరచేతిపై రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. సతారా జిల్లాలోని హోటల్ గదిలో గురువారం రాత్రి ఆమె ఉరి వేసుకుని మరణించారని ఉన్నతాధికారులు తెలిపారు. బీడ్ జిల్లాకు చెందిన బాధిత వైద్యురాలు ఫల్తాన్ తహసీల్ ప్రభుత్వాస్పత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదు నెలలుగా సతారా సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే తనపై పలుమార్లు అత్యాచారం చేసి లైంగికంగా వేధించాడని ఆమె ఆ నోట్లో పేర్కొన్నారు.
అలాగే ప్రశాంత్ బంకర్ అనే మరో పోలీసు అధికారి తనను మానసికంగా చాలా వేధింపులకు గురి చేశారని తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపామని ఉన్నతాధికారులు తెలిపారు. నిందితులు పరారీలో వున్నారని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర హోం శాఖను కూడా నిర్వహిస్తున్న ఫడ్నవీస్ విషయం తెలిసిన వెంటనే సతారా ఎస్పితో మాట్లాడారు. ఆ ఇద్దరు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలీ డిమాండ్ చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను మోహరించామని, వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు.



