– నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
నవతెలంగాణ – కామారెడ్డి : దొంగతనం చేసిన కేసులో నిందితునికి ఆరు నెలల జైలు శిక్ష పడినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద గ్రామానికి చెందిన సిద్ధగారి పర్వయ్య, తన వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన మొత్తంలో నుంచి 1,40,000 తన ఇంట్లోని బీరువాలో ఉంచాడు. తన అత్తగారు అనారోగ్యంతో ఉన్న కారణంగా, కుటుంబ సభ్యులతో కలిసి 22.09.2020 నా ఇంటికి తాళం వేసి అత్తగారింటికి వెళ్లి, 24.09.2020 న తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి, బీరువా తెరచి అందులో ఉన్న డబ్బును గుర్తు తెలియని దొంగలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. ఈ దొంగతనంపై తేది 25.09.2020 నా నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా కాలనీవాసులను విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అనంతరం చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా లభించిన ఆధారాల ప్రకారం, ఫిర్యాదుదారుని ఇంటి ప్రక్కన నివసించే పాత నేరస్తుని అయిన పట్నం సాయిలు తండ్రి పోచయ్యపై అనుమానం వచ్చి విచారించగా, ఆయన నేరానికి సంబంధించిన విషయాలు వెల్లడించడంతో నిందితునిగా గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ విషయములో నేరస్తునిపై కోర్టులో అభియోగ పత్రం వేయడం జరిగిందన్నారు. కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని ఎల్లారెడ్డి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ యం. సుష్మ నిందితునికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినదన్నారు. పోలీస్ తరఫున వాదన వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. రామకృష్ణ, ఈ కేసును సరియైన పద్ధతిలో విచారణ చేసిన అప్పటి నాగిరెడ్డిపేట్ ఎస్హెచ్ఓ యం. రాజయ్య, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. రాజశేఖర్, ప్రస్తుత ఎస్హెచ్ఓ ఐ ఎ. భార్గవ్ గౌడ్, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై రామేశ్వర్ రెడ్డి, సీడీఓ యన్. వినోద్ కుమార్ లను అభినందించడం జరిగిందన్నారు.



