నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : ఆడబిడ్డను కాపాడుకోవడంలో భాగంగా జిల్లాలో శిశువిక్రయాలు, బాల్య వివాహాలు, బాలికల పై లైంగిక దాడుల వంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అన్ని సంక్షేమ శాఖల అధికారులు ఆర్ సి ఓ లు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలో ఎక్కడ శిశు విక్రయాలు జరగకుండా, అలాగే బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థులపై లైంగిక దాడులు వంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కడైనా శిశు విక్రయాలు జరిగితే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. జిల్లాలో ఇటీవల శిశువిక్రయాలు , బాల్య విద్యార్థులపై లైంగిక దాడులు,బాల్యవివాహాలు, తదితర సంఘటనల నేపథ్యంలో శనివారం ఆమె తన చాంబర్లో సంక్షేమ అధికారులు, ఆర్సిఓలతో సమీక్ష నిర్వహించారు.
అభివృద్ధి చెందిన సమాజంలో ఇంకా శిశు విక్రయాలు, బాలికలపై లైంగిక దాడుల వంటివి జరగడం సిగ్గుచేటని అన్నారు. అన్ని శాఖలు ఈ విశయాలపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, బిడ్డలను కన్న ఏ తల్లి దండ్రులు శిశువులను అమ్మడం ,దత్తత ఇవ్వడం వంటివి చేయకుండా ఉండాలని కోరారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టాలు కఠినంగా ఉంటాయన్న విషయం మర్చిపోవద్దని తెలిపారు. సిడిపిఓలు వారి పరిధిలోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆడపిల్లల కోసం ప్రత్యేకించి బేటి బచావో, బేటి పడావో వంటి కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేయాలని అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలలో ఈ విషయాలపై విస్తృత చర్చ నిర్వహించాలన్నారు. జిల్లాలోని దేవరకొండ, పెద్దవూర, తదితర ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ విషయం పై సి డి పి ఓ లు మరింత అప్రమత్తంగా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. దేవరకొండ, నేరేడు గోమ్ము ,చందంపేట, పెద్దవూర, అడవిదేవులపల్లి వంటి మండలాలలో శిశువిక్రయాలు జరగకుండా, అలాగే బాల్య వివాహాలు వంటివి జరగకుండా అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అంతేకాక వాల్ పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, చిన్న చిన్న వీడియోల ద్వారా సమాజంలోని అందరికీ చైతన్యం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చేవారం సి డి పి ఓ లు, సూపర్వైజర్లతో ఈ విషయంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు మండలాలలో అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లను తిరిగి ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా చూడాలని ఆదేశించారు.



