బీహార్లో జీవనోపాధుల మెరుగుదల,
అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలపై దృష్టి
ఆవిష్కరించిన సీనియర్ నాయకురాలు బృందాకరత్
పాట్నా : కేంద్రంలోనూ, బీహార్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని, అందుకనే ప్రజల సమస్యల ఊసెత్తకుండా ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా ప్రతిష్ట దిగజార్చే నీచమైన అసత్య ప్రచారాన్ని ఎన్డీఏ నేతలు చేస్తున్నారని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బృందాకరత్ విమర్శించారు. సీపీఐ(ఎం) ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)ను శనివారం నాడు స్థానిక నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ బీహార్ ప్రజల జీవనోపాధులు మెరుగపర్చేందుకు, అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలను మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్యోగాల సృష్టికి మహాగట్బంధన్ కట్టుబడి ఉందన్నారు. ఆ లక్ష్యాల సాధనలో సీపీఐ(ఎం) తనవంతు కృషిని పోషిస్తుందని ఆమె తెలిపారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ చేస్తున్న దుష్ప్రాచారాన్ని కూడా ఆమె ఎండగట్టారు. బీహార్లో రెండు దశాబ్దాల పాటు పాలన సాగించిన ఎన్డీఏ నేతలు ప్రజలకు చేసిందేమీ లేదని, సాధించిన ప్రగతి లక్ష్యాలే ఏమీ లేవని, అందుకనే ప్రతిపక్షాల అభాండాలు మోపుతూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. జన్ సురాజ్ పార్టీ మద్దతు దారుడు దులార్ ఛంద్ యాదవ్ హత్యకు గురికావడం, జేడీ(యూ) అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ప్రమేయమున్నట్టు వస్తున్న కథనాలపై ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు ఈ ఘటన నిదర్శనమన్నారు. ఎన్డీఏ పాలనలోనే బీహార్లో మాఫియా రాజ్, జంగిల్ రాజ్ నడుస్తోందనేందుకు ఇదే ఉదాహరణ అని ఆమె అన్నారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గగోయిని ‘పాక్ ఏజెంట్’ అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ సహా బీజేపీ నేతలు ప్రతిపక్షాల నేతలను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న అనైతిక వ్యాఖ్యల పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) మ్యానిఫెస్టో విడుదల
- Advertisement -
- Advertisement -



