నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై కీలక వ్యాఖ్యలు చేశారు.బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలతో పాటు ‘హెచ్’ ఫైల్స్ను బహిర్గతం చేశారు. హర్యానాలో 25,41,144 లక్షల ఓటు చోరీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘మా దగ్గర ‘హెచ్’ ఫైల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాం. హర్యానాలోని మా అభ్యర్థులు.. ఏదో తప్పు జరిగిందంటూ ఫిర్యాదులు విరివిగా చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని, ఇందులో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. తాను చెబుతున్న దానికి 100 శాతం రుజువు ఉందని, వారు కాంగ్రెస్ విజయాన్ని ఓటమిగా మార్చడానికి వ్యవస్థాగత తారుమారుకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ గాంధీ పేర్కొన్నారు.
ఓట్ల జాబితా నుంచి డూప్లికేట్ ఓట్లను ఎన్నికల సంఘం ఎందుకు తొలగించడం లేదని, ఎందుకంటే అది బీజేపీ విజయానికి కారణం అవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. హర్యానా ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ విజయాన్ని సూచించాయని, కానీ బీజేపీ గెలవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. హర్యానా ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి 3.5 లక్షల ఓట్లను ఈసీ తొలగించిందన్నారు. దీంట్లో చాలా మంది ఓటర్లు 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో ఎన్నికలు జరగలేదని, అక్కడ దోపిడీ జరిగిందన్నారు. తాను చేస్తున్న ఆరోపణలకు ఈసీ రికార్డులే సాక్ష్యాలు అని, వాటి చెక్ చేసి, మన ఎన్నికల తీరు ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థ పరిశ్రమగా మారిందని, దీన్ని ఇతర రాష్ట్రాల్లో వాడే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. బీహార్లోనూ ఇదే జరుగుతుందని, ఈ వ్యవస్థను మార్చలేమని, ఎందుకంటే ఓటర్ల జాబితా చివరి నిమిషంలో తయారవుతుందని, ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని చంపడమే అని ఆయన పేర్కొన్నారు.



