Thursday, November 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గూండాగిరి

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గూండాగిరి

- Advertisement -

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గూండాగిరి చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు. ఓటర్లను బెదిరించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటర్లను భయపెట్టలేదని చెప్పారు. బోరబండలో కాంగ్రెస్‌ వేధింపులు తట్టుకోలేక సర్దార్‌ అనే బీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. వ్యాపారాలు ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలను బెదిరిస్తున్నారనీ, కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగం చేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్త రియాజ్‌ ఇల్లు కూలగొట్టి దాడి చేశారని వివరించారు. నిరుద్యోగులు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే వారిపై దాడి చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని అనుసరిస్తున్నారని చెప్పారు. నేర చరిత్ర ఉన్న నవీన్‌ యాదవ్‌ తమ్ముడు చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. బీహార్‌లో మిగిలిన 30 వేల కుక్కర్లను పంచడానికి ఓ మంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యహరిస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, చాడ కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -