– సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్లోని రాజ్ బహదూర్ గౌడ్ హాల్లో ఎస్కేఎమ్ సమావేశం పశ్యపద్మ అధ్యక్షతన జరిగింది. అందులో టి. సాగర్, బి రాము, మండల వెంకన్న, ఎం.బిక్షపతి, వి.ఉపేందర్ రెడ్డి, జక్కుల వెంకటయ్య, ఈ.విజరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రుణమాఫీ చట్టం, తదితర డిమాండ్లపై పోరాటాలు చేస్తున్నా, లేబర్కోడ్లను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నా మోడీ సర్కారు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.ఉపాధి హామీ చట్టాన్ని 200 రోజులకు పెంచి రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు రూ.25 వేలు, ఉద్యాన, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనీ, పంటలకు బోనస్ ఇవ్వాలని కోరారు. ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు పరిమితి దారుణమన్నారు. ఆ నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రైతులను సాగు నుంచి క్రమంగా దూరం చేసి కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించే కుట్రలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలనీ, దేశవ్యాప్త పిలుపులో భాగంగా 26న తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
26న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



