నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బ్యాంకు యూనియన్లు తీవ్రంగా ఖండించాయి. దేశానికి ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంతోసేవ చేస్తున్నాయని, అలాంటి బ్యాంకులను ప్రయివేటీకరించాలన్న ఉద్దేశాలు మానుకోవాలని హితవుపలికాయి. మూలధన సాయం అందించి బ్యాంకులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు 9 ట్రేడ్ యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 90 శాతం ఖాతాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే తెరుచుకున్నాయని యూఎఫ్బీయూ గుర్తు చేసింది. ప్రాధాన్యతా రంగాలకు, ప్రభుత్వ పథకాలు ఈ బ్యాంకుల ద్వారానే అందుతున్నాయని తెలిపింది. గ్రామీణ స్థాయిలో బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యత ప్రభుత్వరంగ బ్యాంకులతోనే సాధ్యమైందని పేర్కొంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఇంతటి పటిష్ఠంగా ఉండడానికీ పీఎస్బీలే కారణమంది. అలాంటి పీఎస్బీలను ప్రైవేటీకరిస్తే జాతి ప్రయోజనాలకు విఘాతం కలుతుందని పేర్కొంది. ఉద్యోగ భద్రతతో పాటు, ప్రజల సొమ్ముకూ భద్రత ఉండబోదని తెలిపింది. ప్రైవేటీకరణ వల్ల కార్పొరేట్లకే తప్ప ప్రజలకు ప్రయోజనం ఉండబోదనని తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించబోమని ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మూలధనం, టెక్నాలజీ ఆధునికీకరణ, పారదర్శక పాలన ద్వారా బ్యాంకులను బలోపేతం చేయాలని కోరింది.
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరించడం వల్ల ఆర్థిక సంఘటితానికి, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనలు సరికాదని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. 1969లో జరిగిన బ్యాంకుల జాతీయీకరణ వల్ల అనుకున్న ఫలితాలు రాలేదన్నారు. ‘‘బ్యాంకుల జాతీయీకరణ వల్ల ప్రాధాన్యతా రంగాలకు, ప్రభుత్వ పథకాలకు సహాయం చేయగలిగాం. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రొఫెషనల్గా ఉండలేకపోయాయి. జాతీయీకరణ జరిగిన 50 ఏళ్ల తర్వాత కూడా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయాయి. ప్రైవేటీకరణ వల్ల బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరి దగ్గరకూ తీసుకెళ్లలేమన్నది తప్పు’’ అని బ్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


