ముంబయి : ఉద్యోగ సృష్టి, సామాజిక భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంలో ఆర్థిక ప్రోత్సాహకాలను పొందడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై) పథకంలో చేరాలని అర్హత కలిగిన సంస్థలకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1న ప్రారంభించిన పీిఎంవీబీఆర్వై పథకం వివిధ రంగాల్లో ఉపాధి కల్పనకు ప్రోత్సాహించడానికి రూపొందించినట్టు తెలిపింది. ఇప్పటికే ఈ పథకంలో నమోదైన అనేక సంస్థలు వివిధ ప్రయోజనాలను పొందుతున్నాయని, కానీ ఇంకా చాలా సంస్థలు నమోదు కాలేదని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని సంస్థలను కోరింది.
ఈ మేరకు ముంబయిలోని నారిమన్ పాయింట్లో ఉన్న ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం ప్రకారం.. నెలకు రూ లక్ష వరకూ సంపాదిస్తూ మొదటిసారి ఈపీఎఫ్లో నమోదైన కొత్త ఉద్యోగులు రూ. 15 వేలు వరకూ నగదు ప్రోత్సాహకానికి అర్హులు. ఈ మొత్తాన్ని ఆరు, 12 నెలల తరువాత రెండు విడతల్లో సదరు ఉద్యోగి ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అలాగే, ఈ పథకం కింద అదనపు సిబ్బందిని (కొత్తవారిని, మళ్లీ ఉద్యోగాల్లో చేరేవారిని) నియమించుకునే సంస్థలకు రెండేండ్ల వరకూ నెలకూ ఒకొక్క ఉద్యోగిపై రూ. మూడు వేలు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. తయారీ రంగంలోని సంస్థలకు ఈ ప్రయోజనం నాలుగేండ్ల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తాన్ని సంస్థల పాన్-లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. దీనికి అర్హత సాధించడానికి 50 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరు అదనపు సిబ్బంది, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురు అదనపు సిబ్బందిని నియమించుకోవాలి.
అలాగే ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా ఉద్యోగి నమోదు తప్పనిసరి. సంస్థలు ఈపీఎఫ్ఓ ఎంప్లాయిర్స్ పోర్టల్ లేదా ప్రత్యేక పీఎంవీబీఆర్పై వైబ్సైట్ ద్వారా ఈ పథకంలో చేరాలి. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం పీిఎంవీబీఆర్వై వైబ్సైట్లో వివరణాత్మక మార్గదర్శకాలు, అక్టోబర్ 10న జారీ చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్, అక్టోబర్ 29న జారీ చేసిన ఈపీఎఫ్ఓ సర్క్యూలర్ను చూడాలని సంస్థలకు ఈ ప్రకటన విజ్ఞప్తి చేసింది. కాగా, పీిఎంవీబీఆర్వై తో పాటు ఎంప్లాయిస్ ఎన్రోల్మెంట్ కాంపైన్ 2025ను కూడా కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకూ ఈ కాంపైన్ కొనసాగుతుంది. 2017 జూలై 1 నుంచి 2025 అక్టోబర్ 31 వ్యవధిలో ఇపిఎఫ్ కవరేజ్ తొలగించిన ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవడానికి ఈ కాంపైన్ ప్రధానంగా ఉద్దేశించారు.
ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి పీిఎంవీబీఆర్వైలో చేరండి : సంస్థలకు ఈపీిఎఫ్ఓ విజ్ఞప్తి
- Advertisement -
- Advertisement -



