అక్రమంగా అడవులను నరికితే చర్యలు తప్పవు ఎఫ్డిఓ రామ్మోహన్
నవతెలంగాణ – జన్నారం
కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని, తాళ్ల పేట రేంజ్ తపాలాపూర్ సెక్షన్ బీట్ అడవుల్లో, శుక్రవారం రాత్రి సుమారు 100కు పైగా విలువైన టేకు, ఇతర చెట్లు నరికివేతకు గురి అయ్యాయి. విషయం తెలుసుకున్న తలపేట రేంజ్ అధికారి సుష్మారావు ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లేసరికే, టేకు చెట్లు నరికే వారు పారిపోయారు. అటవీ అధికారులు విలువైన చెట్లను నరికిన వారి ఆరా తీయగా, మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలుసుకొని అట విశాఖ అధికారులు మల్యాల గ్రామానికి వెళ్లి, చెట్లు నరికిన వారి వివరాలు సేకరిస్తున్నారు. మల్యాల గ్రామాన్ని అటవీశాఖ అధికారులు రిలోకేటెడ్ చేయడానికి మంచిర్యాల జిల్లా హాజీపూర్ దగ్గర వారికి స్థలం కేటాయించారు. కానీ మల్యాల గ్రామస్తులు అక్కడికి వెళ్ళమని, ఈ అడవిని నరికి వేసినట్లు సమాచారం..ఈ స్థలం వారికి కేటాయించాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు..
అడవులను నరికితే చట్టపైనమైన చర్యలు తప్పవు: జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్
ఈ విషయంపై ఫోన్లో సంప్రదించగా, తపాలాపూర్ అడవుల్లో చెట్లు నరికి వేతకు గురైనది వాస్తవమేనని కానీ ఎన్ని చెట్లు నరికారో అన్నది లెక్క వేస్తున్నామన్నారు. చెట్లు నరికిన మల్యాల గ్రామస్తులను పట్టుకొని, కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రామస్తులకు ఎలాంటి సమస్యల ఉన్న తమ దృష్టికి తీసుకురావాలి కానీ ఇలా విలువైన టేకు చెట్లను అడవులను నరికితే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు..
అడవులను నరికితే జీవవైవిద్యానికి ఆటంకం
విరివిగా చెట్లను పెంచాలి అడవులను సంరక్షించుకోవాలి కానీ ఇలా దట్టమైన అడవులను నరికివేస్తే అది జీవ వైవిధ్యానికే ఆటంకం గా ఏర్పడుతుందని ఎఫ్డిఓ రామ్మోహన్ అన్నారు. అడవులు ఉంటేనే వాతావరణం సమతుల్యతగా ఉండి సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండుతాయి అని, కానీ ఇష్టం వచ్చినట్లు అడవులను నరికితే వాతావరణం సమతుల్యత దెబ్బతింటుందన్నారు. అడవులను కాపాడుకునే బాధ్యత అందరిది అన్నారు.. గతంలో పాల గౌరి ప్రాంతంలో చెట్లను నరికిన దాదాపు 40 మంది పై కేసులు నమోదు చేసి, జైలుకు పంపామన్నారు. ఇప్పటికీ 25 రోజులు గడుస్తున్న వారు జైల్లోనే మగ్గుతున్నారన్నారు. అనవసరంగా అడవులను నరికి కేసుల పాలై జైలుకు వెళ్లి తమ జీవితాలను దుర్భరం చేసుకోవద్దన్నారు. అక్రమంగా అడవులను నరుకుతే ఎంతటి వారినైనా జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నామన్నారు.



