నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు హోరాహోరి ప్రచారం చేస్తున్నాయి. సిట్టింగ్స్థానాన్ని తిరిగి గెలుచుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కొత్తగా తమ ఖాతాలో మరో సీటును వేసుకోవడానికి, హైదరాబాద్ జిల్లాలో పాగ వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈనెల 11న మంగళవారం జరిగే ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది.
జూబ్లీహిల్స్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలివగా ఇందులో ప్రధాన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా రిజిస్ట్రర్డ్ పార్టీలకు చెందిన వారు 26 మంది, ఇండిపెండెంట్లు 29 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్లో మొత్తం 4.01లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్కేంద్రంలో సగటున 986 ఓటర్లు ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.



