నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఇంట్లో కలకలం రేగింది. లోయర్ దిర్లోని ఆయన నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దుండగులు ఇంటి గేటుపై కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఈ దాడిలో నసీమ్ షా కుటుంబ సభ్యులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్కు నసీమ్ షా దూరమవుతాడని ఊహాగానాలు వచ్చినా, వాటికి తెరపడింది. ఈ దాడి తన షెడ్యూల్పై ఎలాంటి ప్రభావం చూపదని, అతను జట్టుతోనే కొనసాగుతాడని పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. రావల్పిండి వేదికగా మంగళవారం నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్లో నసీమ్ షా యథావిధిగా పాల్గొంటాడు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నసీమ్ షా తండ్రి పోలీసు ఉన్నతాధికారితో సమావేశం కాగా, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని ఆయన హామీ ఇచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరున్నారనే విషయంపై స్పష్టత లేదు.



