మంత్రి కొండా సురేఖపై కేసును వెనక్కి తీసుకున్న నాగార్జున
నా వ్యాఖ్యలపై చింతిస్తున్నా : మంత్రి సురేఖ
నవతెలంగాణ-సుల్తాన్బజార్
మంత్రి కొండా సురేఖ, ప్రముఖ నటుడు నాగార్జున మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. నాగార్జునను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆమె బహిరంగ క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న నాగార్జున మంత్రిపై వేసిన క్రిమినల్ దావా పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ ఎక్స్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ”నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బంది పెట్టాలని కాని, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కాని నా ఉద్దేశం కాదు. నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నా” అని పేర్కొన్నారు. దీంతో నాగార్జున, మంత్రి కొండా సురేఖ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న న్యాయపరమైన వివాదానికి తెరపడినట్టయింది.



