సోషలిజం అనే ఆలోచనను విస్తృతం చేసిన నెహ్రూ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
రవీంద్రభారతిలో నెహ్రూ 80వ సైంటిఫిక్ టెంపర్మెంట్ సెలబ్రేషన్స్
నవతెలంగాణ-కల్చరల్
వైజ్ఞానిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాల ఫలాలు నేటికీ కనిపిస్తున్నాయన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నెహ్రూ 80వ సైంటిఫిక్ టెంపర్మెంట్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైజ్ఞానిక అభివృద్ధికి ప్రయోగశాలగా తెలంగాణను మార్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెహ్రూ వైజ్ఞానికంగా సమాజాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. నెహ్రూ తొలి ప్రధాని కావడంతో సైన్స్ మాత్రమే కాదు ప్రజాస్వామ్యంలోనూ ప్రపంచంతో భారత్ పోటీ పడేందుకు కారణమైందన్నారు. దేశంలో సోషలిజం అనే ఆలోచనను విస్తృతం చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. సోషలిజం, ప్రజాస్వామ్యం అనే ఆలోచనలను భారత రాజ్యాంగంలో మేళవించి ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. దేశంలో ఐదేండ్లకోసారి ఎన్నికలు జరగడం. ఎవరు మెజారిటీ సాధిస్తే వారికి ఓ మంచి వాతావరణంలో అధికార బదలాయింపు జరుగుతుందని, ఇందుకు నెహ్రూ దార్శనికతతో కూడిన విధానాలే కారణమని చెప్పారు.
దార్శనికత లేని వారు పరిపాలన సాగిస్తే ఆ సమాజానికి శాపంగా మారుతాయన్నారు. సైన్స్, టెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకొని నెహ్రూ ఇందిరా, గాంధీ అనేక కేంద్ర సంస్థలను స్థాపించారని వివరించారు. దాంతో హైదరాబాద్లో ప్రధాన పరిశ్రమలకు అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. యూజీసీ, సెంట్రల్ యూనివర్సిటీ వంటి వాటిని నెలకొల్పారని, అక్కడ రీసెర్చ్లు జరుగుతున్నాయి కాబట్టే ప్రస్తుతం దేశ అవసరాలు తీరుతున్నాయన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను 25 ఎకరాల్లో, రూ.200 కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. విజ్ఞాన ప్రదర్శనల కోసం పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ సహకారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో శాస్త్రీయ దృక్పథాన్ని కొనసాగించేందుకు స్కిల్ యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతు న్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని ట్రై కార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్ను డిప్యూటీ సీఎం కోరారు.



