నవతెలంగాణ-హైదరాబాద్: రష్యాతో నిలిచిన శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ఇద్దరు అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులు ఉక్రెయిన్ చేరుకున్నట్లు జాతీయ మీడియా బుధవారం పేర్కొంది. ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, సీనియర్ కమాండర్లు, చట్టసభ సభ్యులతో సమావేశం కానున్నట్లు ప్రణాళిక గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ తెలిపింది. ఉక్రెయిన్తో చర్చల తర్వాత ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్ రష్యన్ అధికారులను కలవనున్నట్లు మరో మీడియా ప్రత్యేక కథనంలో పేర్కొంది. ఈ కథనంపై పెంటగాన్ లేదా వైట్ హౌస్ స్పందించాల్సి వుంది.
గతంలో శాంతి చర్చలు ఫలించకపోవడంతో, సైనిక మధ్యవర్తులకు రష్యా మెరుగ్గా స్పందిస్తుందని వైట్ హౌస్ డాన్ డ్రిస్కాల్ సహా సీనియర్ కమాండర్లను చర్చల కోసం ఎంపిక చేసిందని ఆ మీడియా కథనం తెలిపింది. ట్రంప్ యంత్రాంగం రష్యాను సంప్రదించి ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి రహస్యంగా ఒక కొత్త ప్రణాళికను రూపొందిస్తోందని అమెరికా, రష్యా అధికారులను ఉటంకిస్తూ మంగళవారం ఆక్సియోస్ రిపోర్ట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
కాగా, ఉక్రెయిన్ పాశ్చాత్య మిత్రదేశాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే పోలాండ్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యా వైమానిక దాడులకు దిగిందని ఆరోపిస్తూ.. పోలాండ్ బుధవారం తెల్లవారుజామున విమానాలను మోహరించింది.



