కూలిన భారత యుద్ధ విమానం ‘తేజస్’ : పైలట్ మృతి
దుబాయ్ : దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పైలట్ మృతి చెందాడు. భారత వాయుసేనలో వినియోగిస్తున్న యుద్ధ విమానం హెచ్ఏఎల్ తేజస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా నేలను తాకి కూలిపోయింది. దీంతో క్షణాల వ్యవధిలోనే మంటలు చేలరేగి ఫైటర్ జెట్ పూర్తిగా దగ్ధమైంది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్టు భారత వైమానిక దళం ధ్రువీకరించింది. ఇందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. ఈ ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది.
ఆకాశంలో అలుముకున్న నల్లటి పొగ
ఫైటర్ జెట్ కూలిన నేపథ్యంలో విన్యాసాలు జరుగుతున్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నల్లటి పొగ ఆకాశాన్ని అలుముకుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా సైరన్లు మోగాయి. యుద్ధ విమానం ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెగెటివ్ జీ-ఫోర్స్ టర్న్ నుంచి పైలట్ యుద్ధవిమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన అయిన దుబాయ్ ఎయిర్షోలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు పాల్గొని సందడి చేస్తాయి.
భారీగా తేజస్ విమానాలకొనుగోళ్లకు ఆర్డర్లు
తేజస్ యుద్ధ విమానం హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో తయారైంది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 4.5వ తరం ఫైటర్జెట్. భారత్ తయారు చేసిన తొలితరం యుద్ధ విమానం తేజస్ ఎంకే 1ఏ. ఇప్పటికే ఈ విమానాల కొనుగోళ్లకు వైమానిక దళం ఆర్డర్లు ఇచ్చింది. 350కిపైగా తేజస్ విమానాలను ఇండక్ట్ చేసుకునేందుకు సిద్ధమైంది. గత అక్టోబర్లో 2 విమానాలను వైమానికదళానికి హెచ్ఏఎల్ అందించింది.
తేజస్ ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి
ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్లోని జైసల్మేర్లో తేజస్ ఫైటర్ జెట్ శిక్షణ సార్టీలో ఉండగా కూలిపోయింది. ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.



