సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్
29 కార్మిక చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్రం నాలుగు లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించడాన్ని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ లేబర్ కోడ్లతో 29 కార్మిక చట్టాలు నిర్వీర్యమవు తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఈ చట్టాలు కొంతమేర కార్మికుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వచ్చాయని తెలిపింది. అనేక పరిమితులు ఉన్నప్పటికీ, వేతనాలు, పనిగంటలు, సామాజిక, పారిశ్రామిక భద్రత, తనిఖీ – సమ్మతి యంత్రాంగాలు, సమిష్టి బేరసారాలు వంటివి అమల్లో ఉండేవని వివరించింది. వీటిని కార్మికులకు మరింత అనుకూలంగా మార్చడానికి బదులుగా కొత్త లేబర్కోడ్లు కార్మికుల హక్కులను నీరుగారుస్తున్నాయని పేర్కొన్నది. యజమానులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శిం చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ”ఈ కార్మిక చట్టాలతో ఉపాధి, పెట్టుబడులు పెరుగు తాయని ప్రభుత్వం చేస్తున్న వాదన పూర్తిగా నిరాధారం.
పెట్టుబడి దారులను రక్షించడం కోసం కార్మికులకు భద్రత లేకుండా వుండేలా ఈ కోడ్లు రూపొందించారు. కార్మిక వర్గం సమ్మె చేసే హక్కును లాక్కోవాలని, అలాగే కార్మికులు సామూహికంగా చేసే ఏ చర్యనైనా నేరపూరితం చేయాలని ఆ కోడ్లు కోరుతున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వం, పాలనా యంత్రాంగం కార్మికుల హక్కులను కాలరాస్తాయి” అని పేర్కొన్నది.కార్మికులతో నిజాయితీగా సంప్రదింపులు జరపకుండా ఈ కోడ్లను అమలు చేయడంలో ప్రజాస్వామ్య, ఫెడరల్ నిబంధనలను దారుణంగా ఉల్లంఘించడాన్ని పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. లేబర్ కోడ్లకు చేసిన అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం చాలా దురుసుగా తిరస్కరించిందని వివరించింది. ఈ లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు సమైక్య పోరాటాలను నిర్మించాలని అన్ని కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది.



