అనర్హత నోటీసుపై శ్రీధర్బాబుతో దానం రాజీనామాకు సిద్ధం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు త్వరలో తేలనుంది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శనివారం హైదరాబాద్లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్బాబుతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. అందులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఇచ్చిన అనర్హత నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని అడిగినట్టు సమాచారం. ఇప్పటి ఈ విషయంపై ఏఐసీసీ నేతలతో దానం నాగేందర్రెడ్డి చర్చించారనే వ్యాఖ్యానాలు గాంధీభవన్లో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా రాజీనామా, ఇంతర అంశాలపై ఆయన సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. తాను రాజీనామా చేసినా, మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అనర్హతకు గురయ్యే పరిస్థితి ఉంటే రాజీనామా చేస్తానని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బి. మహేష్కుమార్గౌడ్కు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ను కలిసి అర్హత నోటీసుకు సమాధానం ఇవ్వడానికి మరింత గడువును కోరినట్టు సమాచారం. ఆదివారంలోపు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు సమాధానం చెబుతూ అఫిడవిట్ను దాఖలు చేయాల్సి ఉంది. స్పీకర్ గడువు ఇస్తే ఆలోపు సమాధానం ఇస్తానని శనివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాను. ఉప ఉన్నికలు వస్తే కచ్చితంగా మళ్లీ పోటీచేస్తానని’ చెప్పారు. రాజీనామా చేయకపోతే దానం నాగేందర్పై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేయడమే ఇందుకు కారణమని తెలిసింది.



