న్యూఢిల్లీ: భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. అనంతరం సీజేఐగా బాధ్యత లు చేపట్టనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్ తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు.
1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హౌదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకూ హర్యానా అడ్వకేట్ జనరల్గా పని చేశారు. 2018 అక్టోబరు 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. దీంతోపాటు వాక్స్వాతంత్య్రం, అవినీతి, బీహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగసమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు.
నేడు నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -



