రాత ద్వారా మారొచ్చు..వ్యక్తిత్వాన్ని నిర్ణయించుకోవచ్చు
గ్రాఫోథెరఫి ద్వారా మనషులు మారొచ్చు
పిల్లల్లో పాజిటివ్ థింకింగ్స్ పెంచాలి
వారిని పొగడాలి..ప్రోత్సహించాలి : ప్రొఫెసర్. సీహెచ్ రాంచంద్రయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన చేతరాత ద్వారా రాసే అక్షరాలే మనమేంటో చెబుతాయని ప్రొఫెసర్ సీహెచ్.రాంచంద్రయ్య చెప్పారు. చేతి రాతను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యక్తిత్వాన్ని మరింత పెంచుకోవచ్చుననీ, గ్రాఫోథెరఫి ద్వారా మనుషులు మారొచ్చని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం(హెచ్సీఎఫ్) ఆధ్వర్యంలో ‘గ్రాఫాలజీ, గ్రాఫోథెరపి పరిచయం’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచంద్రయ్య మాట్లాడుతూ…మన రాసే చేతిరాతని బట్టి మన గుణగణాలేంటి అనే దానిపై ప్రాథమిక అంచనాకు రావొచ్చన్నారు. చేతిరాత బాగుంటే పిజికల్, మెంటల్గా రిలాక్సేషన్ ఉంటుందని చెప్పారు.
చేతిరాతి మెరుగుపర్చుకోవాలనుకునే వారికి ప్రత్యేక కోర్సులు కూడా ఉన్నాయనీ, అవసరమైన వారు సంప్రదించాలని సూచించారు. చేతిరాతలోని స్ట్రోక్లను చిన్నచిన్నమార్పులు చేసుకోవడం ద్వారా వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోవడమే గ్రాఫోథెరఫి అని వివరించారు. చేతి వ్యాయామాలు అనేవి చేతిని, మనస్సును సమన్వయపర్చడానికి దోహదపడుతాయని తెలిపారు. స్వీడన్లో క్లాస్ రూమ్ బోధన మొత్తం డిజిటల్ అయిపోయిందనీ, అయితే, చేతిరాత కూడా పిల్లలకు అవసరమని అక్కడ గుర్తించారని వివరించారు. ఎప్పుడు ఇంతేనా..ఇంతేనా…అని పిల్లలను నిరుత్సాహానికి గురిచేయొద్దనీ, వీలైతే పొగుడుతూ ప్రోత్సహించాలని చెప్పారు. పిల్లలను పొగిడితే అతి గారాబం అవుతుందనేది ఒట్టిమాటేనన్నారు.
పిల్లలను నిరంతరం ప్రోత్సహిస్తే వారిలో పాజిటివ్ థింకింగ్స్ పెరుగుతాయనీ, వారి ఆలోచనా విధానం మారుతుందని వివరించారు. గ్రాఫోథెరఫి ద్వారా చేతిరాతను మెరుగుపర్చడం ద్వారా పిల్లల్లోని నెగెటివ్ థింకింగ్ను మార్చొచ్చన్నారు. అయితే, పిల్లల్లో మెరుగుదల శాతం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుందనీ, కొందరిలో నెల, రెండు నెలల్లో మార్పొస్తే మరికొందరిలో మూడు,నాలుగు నెలల సమయం పట్టొచ్చని వివరించారు. హెచ్సీఎఫ్ ఉపాధ్యక్షులు మల్లం రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్, పర్యావరణవేత్త జయసూర్య, సామాజికవేత్త రాజీవ్, హెచ్సీఎఫ్ అధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కార్యదర్శి కె.వీరయ్య, నాయకులు పి.శ్రీనివాసరావు, సంగీత, హేమంత్కుమార్, సుకుమార్, లలిత, తదితరులు పాల్గొన్నారు.



