విద్యార్థులతో ఇష్టాగోష్టిలో శుభాంశు శుక్లా
బెంగళూరు : రోదసీ స్టేషన్ ఏర్పాటు, చంద్రునిపై కాలు పెట్టడం వంటి బృహత్తరమైన లక్ష్యాలను జీవిత లక్ష్యాలుగా పెట్టుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని భారత వ్యోమగామి, గగన్యాత్రి, ఇండియన్ ఎయిర్ఫోర్స్ గ్రూపు కెప్టెన్ శుభాంశు శుక్లా మంగళవారం విద్యార్ధులను కోరారు. స్థానికంగా విద్యార్ధులతో ఇష్టాగోష్టి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రుని ఉపరితలంపై మొదటగా కాలు పెట్టేది పురుషుడా లేక మహిళా అనేది చూడాలని తనకు చాలా ఆసక్తిగా వుందని అన్నారు. భవిష్యత్తులో వ్యోమగాములు కావాలనుకున్న వారెవరైనా తనతో పోటీ పడాలని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. మనకు స్వంతంగా భారతీయ అంతరిక్ష (రోదసీ) స్టేషన్ వుండాలని, 2040కల్లా చంద్రునిపైకి భారతీయుడిని పంపాలన్నది మన లక్ష్యమని చెప్పారు. మీలో ఎవరో ఒకరు అందులో వుండవచ్చని విద్యార్ధులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
మన సొంత గడ్డపై నుండి, మన సొంత లాంచ్ వెహికల్లో, సొంత కేప్స్యూల్లో ఒక భారతీయుడు రోదసీకి వెళ్ళి రావడమనే ఆలోచనే చాలా ఉద్విగతను కలగచేస్తోందని అన్నారు. భారతదేశ భవిష్యత్ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోందన్నారు. 2047కల్లా వికసిత్ భారత్లో భాగంగా భారత్ను అభివృద్ది చెందిన దేశంగా చూడాలన్నది లక్ష్యమని, త్వరలోనే ఇది నెరవేరుతుందని ఆశిద్దామని చెప్పారు.
చంద్రునిపైకి వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకోండి
- Advertisement -
- Advertisement -



