తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.గిరిధర్ గౌడ్, కోశాధికారి బి.తుకారం పాఠశాల విద్య సంచాలకులు నవీన్ నికోలస్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎలాంటి ప్రమేయం లేకపోయినా, వాస్తవ మార్కెట్ ధరకు, ప్రభుత్వం చెల్లించే గుడ్డు, కూరగాయల ధరలకు వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అభ్యంతరం తెలిపారు. ఏజెన్సీలు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ దానికి ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తాము చేసిన వినతికి కూడా సమాధానం రాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.



