నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బారాబతి స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో పాండ్యా తన ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో మిగతా బ్యాటర్లు రాణించడానికి ఇబ్బంది పడిన చోట, హార్దిక్ పాండ్యా కేవలం 28 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు సాధించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టును భారత బౌలర్లు కేవలం 74 పరుగులకే కట్టడి చేశారు. బౌలింగ్లోనూ పాండ్యా తాను వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టి తన ఆల్ రౌండ్ ప్రతిభను చాటాడు.
అవార్డు అందుకున్న అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. “నా షాట్లపై నాకు నమ్మకం ఉంది. పిచ్ మీద బంతి కాస్త స్పైసీగా వస్తోందని గ్రహించాను. కాస్త ధైర్యంగా ఆడాల్సి వచ్చింది. బంతిని బలంగా బాదడం కంటే టైమింగ్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. నా బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను” అని తెలిపాడు. గత ఆరు, ఏడు నెలలుగా ఫిట్నెస్ పరంగా అద్భుతంగా గడిచిందని చెప్పాడు.
“గత 50 రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఎన్సీఏలో కష్టపడ్డాను. ఆ శ్రమకు ఇక్కడ ఫలితం దక్కినప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. నేను జట్టులో నా పాత్ర గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించను. జట్టు, దేశ ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఇదే నా అతిపెద్ద బలం” అని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. సరైన బౌలర్ను లక్ష్యంగా చేసుకుని ఆడటం వల్లే మంచి ఫలితం వచ్చిందని తన ఆటతీరును వివరించాడు.



