నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి దశలో భారీగా పోలింగ్ నమోదయింది. మంగళవారం ఏడు జిల్లాల్లో తొలి దశ పోలింగ్ను నిర్వహించారు. సాయంత్ర 6 గంటల సమయానికి మూడు జిల్లాల్లో పోలింగ్ 70 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. తిరువనంతపురం, కొల్లాం, పథనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాల్లో తొలి దశ జరిగింది. వీటిలో ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 73.36 శాతం, అలప్పుజలో 72.74 శాతం, ఇడుక్కిలో 70.26 శాతం నమోదయింది.
కొట్టాయంలో 69.77 శాతం, కొల్లాంలో 69.32 శాతం, తిరువనంతపురంలో 65.93 శాతం, పథనంథిట్టలో 65.91 శాతం పోలింగ్ నమోదయింది. మంగళవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమయింది. 595 స్థానిక సంస్థలకు ఈ తొలి దశలో ఎన్నికలు జరిగాయి. రెండో దశ ఈ నెల 11న జరగనుంది.
ఈ నెల 13న ఫలితాలు వెల్లడించనున్నారు. తిరువనంతపురంలో క్యూలైన్లో నిల్చున్న ఒక వృద్ధ మహిళా ఓటర్ మృతి చెందారు. పట్టణంలోని తిరువల్లం వార్డులోని పచలూర్ స్కూల్లో ఏర్పాటు చేసిన బూత్ నంబర్6లో 73 ఏళ్ల శాంత అనే ఓటర్ తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం క్యూలైన్లో వేచిచూస్తున్నారు. అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్తానికులు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కాని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.



