ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ప్రజాప్రయోజనాలకు వినియోగించాలి : సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఐడీపీఎల్ భూములపై వస్తున్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడాన్ని సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ స్వాగతిస్తుందని జిల్లా కార్యదర్శి పి.సత్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐడీపీఎల్ భూములు కబ్జాలకు గురవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, ఈ భూముల్లో 50 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్న పేదలను మినహాయించి మిగతా భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని కోరారు. 891 ఎకరాల ఐడీపీఎల్ భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఆ భూమిని ప్రజాప్రయోజనాలకు వినియోగించాలని పేర్కొన్నారు. 1967లో ఐడీపీఎల్ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని తెలిపారు.
ఐడీపీఎల్ సంస్థ 47 రకాల ఔషధాలను తయారు చేస్తూ దేశానికి, ప్రజలకు ఎనలేని సేవలు అందించిందని పేర్కొన్నారు. ప్లేగ్ వ్యాధి ప్రబలిన సందర్భంలో ఏ సంస్థలూ ముందుకు రాని సమయంలో ఐడీపీఎల్ ప్రజలకు ఔషధాల్ని అందించి రక్షించిందని, అలాంటి పరిశ్రమను 2003లో కేంద్రంలోని నాటి వాజ్పేరు ప్రభుత్వం మూసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ స్థాపన కోసం కేంద్రానికి భూమిని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిశ్రమ మూతపడిన తర్వాత తిరిగి దాన్ని స్వాధీనం చేసుకునేందుకు తగిన ప్రయత్నాలు చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐడీపీఎల్ భూములపై న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకుని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఐడీపీఎల్లో పని చేసిన కార్మికులు కంపెనీ మూతపడటంతో తీవ్రంగా నష్టపోయారని, వారికి పెన్షన్ కూడా తగిన పద్ధతుల్లో రావడం లేదని, ఆ భూముల్లో కార్మికులకు కొంత కేటాయించాలని పేర్కొన్నారు.



