సెమీస్లో శ్రీలంకపై గెలుపు
అండర్-19 ఆసియా కప్
దుబాయ్ : అండర్-19 ఆసియా కప్ (వన్డే) ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. శుక్రవారం దుబాయ్ లో జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక అండర్-19 జట్టుపై యువ భారత్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అండర్-19 జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత కుర్రాళ్లు 18 ఓవర్లలోనే ఛేదించారు. అరోన్ జార్జ్ (58 నాటౌట్, 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), విహాన్ మల్హోత్రా (61 నాటౌట్, 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ అండర్-19పై పాకిస్తాన్ అండర్-19 జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్, పాకిస్తాన్ తలపడతాయి.



