మూడో టెస్టులో 82 పరుగులతో గెలుపు
3-0తో సిరీస్ విజయం సొంతం
ఆడిలైడ్ (ఆస్ట్రేలియా) : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్లో మరో రెండు మ్యాచ్లు ఉండగానే 3-0తో యాషెస్ సిరీస్ ట్రోఫీని గెల్చుకుంది. ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఆడిలైడ్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 435 పరుగుల భారీ ఛేదనలో ఇంగ్లాండ్ 102.5 ఓవర్లలో 352 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జాక్ క్రాలీ (85, 151 బంతుల్లో 8 ఫోర్లు), జెమీ స్మిత్ (60, 83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీలు సహా విల్ జాక్స్ (47), జో రూట్ (39), బ్రైడన్ కార్స్ (39), హ్యారీ బ్రూక్ (30) మెరిసినా.. ఇంగ్లాండ్ ఓటమి నుంచి తప్పించుకోలేదు. బెన్ డకెట్ (4), ఒలీ పోప్ (17), బెన్ స్టోక్స్ (5) నిరాశపరిచారు.
ఐదు రోజు లంచ్ తర్వాత ఇంగ్లాండ్ కథ ముగియగా ఆస్ట్రేలియా సిరీస్ సంబురాల్లో మునిగింది. అలెక్స్ కేరీ (106), ఉస్మాన్ ఖవాజా (82), మిచెల్ స్టార్క్ (54) రాణించగా తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులు చేసిన ఆస్ట్రేలియా… రెండో ఇన్నింగ్స్లో 349 పరుగులు సాధించింది. ట్రావిశ్ హెడ్ (170), అలెక్స కేరీ (72) రాణించారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌట్ కాగా.. బెన్ స్టోక్స్ (83), జోఫ్రా ఆర్చర్ (51), హ్యారీ బ్రూక్ (45) ఆదుకున్నారు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాటర్ అలెక్స్ కేరీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టు 26 నుంచి మెల్బోర్న్లో జరుగుతుంది.



