మొదటి స్థానంలో బీజేపీ
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ వివిధ ఎలక్టొరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా అవి మూడు రెట్లు పెరిగి 2024-25లో రూ.3,811 కోట్లకు చేరాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అత్యధికంగా రూ.3,112 కోట్ల విరాళం అందింది. తొమ్మిది ఎలక్టొరల్ ట్రస్టులు అందించిన మొత్తం విరాళాలలో ఇది ఐదింట నాలుగు వంతుల (82 శాతం) కంటే ఎక్కువే. వివిధ ట్రస్టులు ఎన్నికల సంఘానికి సమర్పించిన కంట్రిబ్యూషన్ నివేదికల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళం కేవలం రూ.299 కోట్లు మాత్రమే. మొత్తం విరాళాలలో ఇది ఎనిమిది శాతమే. మిగిలిన రూ.400 కోట్లను (10 శాతం) ఇతర పార్టీలు పొందాయి.
2023-24లో ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళం రూ.1,218 కోట్లు. అయితే అది ఆ మరుసటి సంవత్సరానికే మూడు రెట్లు పెరిగింది. రాజకీయ పార్టీలకు అందే విరాళాలలో అధిక భాగం ఎలక్టొరల్ ట్రస్టుల ద్వారానే చేరుతుంది. బీజేపీకి భారీగా విరాళం ఇచ్చింది ప్రుడెంట్ ఎలక్టొరల్ ట్రస్ట్. దీని నుంచి బీజేపీకి రూ.2,668 కోట్లు అందాయి. ఇదే ట్రస్ట్ నుంచి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, తెలుగుదేశం వంటి పార్టీలకు కొద్ది మొత్తంలో విరాళాలు చేరాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టొరల్ ట్రస్ట్ సుమారు రూ.915 కోట్లు విరాళంగా అందించింది. ఇందులో కూడా 81 శాతం వాటా బీజేపీదే.



