అక్కడ కూరగాయల సాగు బాగుంది : రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేరళలో కూరగాయల సాగు బాగుందనీ, అక్కడి మార్కెటింగ్ వ్యవస్థ భేష్ అని తెలంగాణ రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి కొనియాడారు. సోమవారం హైదరాబాద్లోని రైతు కమిషన్ కార్యాలయంలో కేరళ పర్యటన అనుభవాలు, అక్కడి కూరగాయల సాగు విధానం, మార్కెటింగ్, రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే అంశాలు, కౌలు రైతు పాలసీ విధానంపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. రైతు కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భూమి సునీల్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాష్మిన్ బాషా, అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ నర్సింహా రావు, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, అగ్రికల్చర్, మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ…అక్కడ కౌలు వ్యవసాయ విధానం బాగుందని చెప్పారు. వ్యవసాయానికి అనుకూలమైన విధానాలను అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్నదని తెలిపారు.
అగ్రి, హార్టికల్చర్ శాఖ అధికారులతో ఇవాళ కేరళ పర్యటనపై డిస్కషన్ చేశామనీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా హార్టికల్చర్ పెంచాలని భావిస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు పెంచడానికి చేయాల్సిన కసరత్తుపై సమావేశంలో చర్చించామన్నారు. తెలంగాణలో కూరాయగల సాగు చేసే రైతులు అమ్ముకోడానికి ఇబ్బంది పడ్తున్నారనీ, మన రాష్ట్రంలో కూడా కూరగాయల మార్కెట్లు మారాలని ఆకాంక్షించారు. దోపిడీ వ్యవస్థ లేని మార్కెట్లు రావాలన్నారు. తెలంగాణ వచ్చాకా వ్యవసాయానికి సంబందించిన పాలసీలు జరగలేదనీ, గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. నెలరోజుల్లో నిర్దిష్ట ఆలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.



