శివాజీ, నవదీప్, నందు, రవికష్ణ, మనికా చిక్కాల తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ,’నిర్మాత బెన్నీ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు సినిమా మీద ఉండే అభిరుచి నాకు చాలా ఇష్టం. మళ్లీ ఈనెల 25న ఈ సినిమాతో ఆయనకు విజయం దక్కాలి. ‘దండోరా’ టైటిల్ నాకు చాలా నచ్చింది. ఇందులో పాటను రాసిన కాసర్ల శ్యాంకి నేషనల్ అవార్డు దక్కాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన ఆర్టిస్టులు నటించారు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే నాకు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా మారుతుందని అనిపించింది. సమాజంలోని బలహీనతను దమ్ముతో దండోరా వేయించి చెప్పేందుకు చాలా గట్స్ ఉండాలి. డైరెక్టర్ మురళీకాంత్కి చాలా దమ్ము, ధైర్యం ఉంది. తన కోసం, తనకంటూ కొత్త పాత్రల్ని రాయాలనే సవాల్ను రాబోయే దర్శకులకి శివాజీ విసురుతున్నారు’ అని అన్నారు.
‘నా సోదరుడు అనిల్ రావడంతో మా సినిమా మరింత మందికి రీచ్ అవుతుంది. ఈ సినిమా తరువాత నిర్మాత బెనర్జీని చూసే తీరు మారుతుంది. మురళీకాంత్ స్క్రిప్ట్ అద్భుతంగా రాసుకున్నాడు. నా పాత్ర కూడా బాగానే ఉంటుంది. ఈ వారం రాబోతున్న చిన్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఈనెల 25 సాయంత్రానికి ఇది పెద్ద సినిమా అవుతుంది. అందరికీ నచ్చే సినిమా.. పది మందికి చెప్పే సినిమా. ప్రపంచమంతా మా ‘దండోరా’ సౌండ్ వినిపిస్తుంది’ అని శివాజీ అన్నారు. ‘మురళీ నాకు మూడేళ్ల క్రితం స్టోరీ చెప్పాడు. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి చిత్రాన్ని చేయాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సపోర్ట్ ఎంతో అవసరం. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ మూవీకి స్టోరీనే హీరో, కంటెంట్ హీరోయిన్. మిగతాది సక్సెస్ మీట్లో మాట్లాడతాను’ అని నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని చెప్పారు.
నవదీప్, నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని, దర్శకుడు మురళీకాంత్, బిందు మాధవి, మైత్రి శశిధర్ రెడ్డి, నటుడు రవికష్ణ, డీఓపీ వెంకట్ ఆర్. శాకమూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నటుడు ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పెరెజ్, ప్రొడక్షన్ డిజైనర్ క్రాంతి ప్రియం తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
అందరికీ నచ్చే సినిమా… పది మందికి చెప్పే సినిమా
- Advertisement -
- Advertisement -



