– కాపాడిన పోలీసులు, ఫైర్ సిబ్బంది
– సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఘటన
నవతెలంగాణ-దుబ్బాక
పనిమీద దుబ్బాకకు వచ్చిన ఓ వృద్ధుడు.. కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు పక్కకు వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడున్న ఓ బావిలో పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్ 6వ వార్డులో (దుబ్బాక – సిద్దిపేట రహదారి) దేశాయి బీడీ కంపెనీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, దుబ్బాక ఎస్ఐ కే. కీర్తిరాజు, ఫైర్ ఆఫీసర్ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన ఆర్ల శివరాజయ్య అనే వృద్ధుడు.. సొంత పని నిమిత్తం సోమవారం దుబ్బాకకు వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున చేర్వాపూర్ వార్డు శివారులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చి.. ప్రమాదవశాత్తు నీళ్లు లేని పాడుబడ్డ బావిలో జారిపడ్డాడు. కొంతసేపటి తర్వాత బావిలో నుంచి వృద్ధుని అరుపులు విన్న స్థానిక రైతులు.. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది బావిలోంచి వృద్ధుడిని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చారు. అనంతరం 108 అంబులెన్స్లో దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి ఆయన స్వగ్రామానికి అంబులెన్స్లో తరలించారు.
ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వృద్ధుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



