Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం3, 4 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సెమినార్‌

3, 4 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సెమినార్‌

- Advertisement -

విద్యారంగంలో మతోన్మాదంపై ప్రత్యేక చర్చ
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవరి 3, 4 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ స్థాయి సెమినార్‌ నిర్వహించనున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌, ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో రజనీకాంత్‌ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం, ఐదేండ్లుగా విద్యారం గంలో చోటుచేసుకున్న మార్పులు, మతోన్మాద ధోరణులు, కార్పొరేటీకరణపై ఈ సెమినార్‌లో విస్తృత చర్చ జరగనుందని తెలిపారు. బీజేపీ అధికా రంలోకి వచ్చిన తర్వాత విద్యారం గంలో మతోన్మాద విధానాలు అమలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవస్థలను కూలదోసి, ఫెడరల్‌ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేస్తోందన్నారు. యూజీసీ రద్దు, విద్యలో ఎఫ్‌డీఐలకు అనుమతి, విదేశీ విశ్వవిద్యాలయాల ఆహ్వానం, విద్యారంగం ప్రయివేటీకరణకు చర్యలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై సెమినార్‌లో చర్చ జరగనుందని తెలిపారు. ఈ విధానాల వల్ల దళిత, గిరిజన, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతు న్నారన్నారు. విద్యారంగానికి నిధులు తగ్గించడం, హాస్టల్‌ సదుపాయాల లోపం, నాణ్యమైన విద్య లేకపోవడం వంటి సమస్యలపై కూడా తీర్మానాలు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ఈ సెమినార్‌కు ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్‌ ప్రభావత్‌ పట్నాయక్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పురకాయస్థ, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాలహక్కుల ఫోరం చైర్మెన్‌ ప్రొ.శాంతాసిన్హా, ఎస్‌ఎఫ్‌ఐ ఆల్‌ ఇండియా మాజీ అధ్యక్షులు ఆర్‌.అరుణ్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిలభారత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శ్‌ ఎం.సాజీ, శ్రీజన్‌ భట్ట, అఖిల భారత ఉపాధ్యక్షులు శిల్ప, రోహిదాస్‌, అతిక్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ..
హైదరాబాద్‌ మహానగరంలో ఈ జాతీయ కన్వెన్షన్‌ను నిర్వహించడం ద్వారా నూతన జాతీయ విద్యావిధానంపై పోరాటానికి తెలంగాణ వేదిక కానుందని అన్నారు. ఈ కన్వెన్షన్‌ సందర్భంగా జనవరి 3న ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు లేనిన్‌ గువేరా, నాయకులు శ్రీమన్‌, నాగేందర్‌, స్టాలిన్‌, రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -