ముంబయి : కొత్త ఏడాది తొలిరోజే భారత స్టాక్ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మార్కెట్లను నడిపించే సానుకూలాంశాలు ఏవి కానరాకపోవడంతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 32 పాయింట్లు తగ్గి 85,188.6కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 16.95 పాయింట్లు పెరిగి 26,146.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బీఈఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు ఎన్టీపీసీ, ఎటెర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి. సిగరెట్లపై ఫిబ్రవరి 1 నుంచి 40 శాతం జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రకటన ఐటీసీ షేర్లను తీవ్రంగా ఒత్తిడికి గురి చేసింది. ఆ కంపెనీ షేర్ బీఎస్ఈలో 9.69 శాతం నష్టపోయి రూ.363.95 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలపై కేంద్ర క్యాబినెట్ మారటోరియం విధించడంతో వీఐ షేర్ 8.09 శాతం పెరిగి రూ.11.63 వద్ద ముగిసింది.



