– ప్రధానోపాధ్యాయులు చౌడారావు రాంప్రసాద్
– సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమానికి ఎంపికైన కోనాపూర్ పాఠశాల
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఆత్మరక్షణ నైపుణ్యాల వల్ల బాలికల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, భౌతిక వికాసం, మానసిక వికాసం, అలవడుతుందని మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారావు రాంప్రసాద్ అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమానికి కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు ఉచి తంగా కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కోనాపూర్ ఉన్నత పాఠశాలలో కరాటే మాస్టర్ రోహిత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారావు రాంప్రసాద్ మాట్లాడుతూ… ఆత్మరక్షణ నైపుణ్యాల వల్ల బాలికల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నారు. అంతేకాకుండా భౌతిక వికాసం, మానసిక వికాసం అలవడుతుందన్నారు. ఆత్మ రక్షణ మాత్రమే కాకుండా ఇతరులను కూడా రక్షించ వచ్చని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 262 పాఠశాలలను శిక్షణకు ఎంపిక చేసిన ప్రభుత్వం, కరాటే ఇన్స్ట్రక్టర్ లకు రూ.15వేల గౌరవ వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు ఏదైనా ఆపత్కర సమయంలో తమను తాము రక్షించుకునే విధంగా శిక్షణ దోహదపడుతుందన్నారు. మూడు నెలల పాటు వారానికి మూడుసార్లు శిక్షణ ఉంటుందని, శిక్షణ ద్వారా ఆత్మ రక్షణ మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కరాటే మాస్టర్ విద్యార్థినులకు కరాటే శిక్షణలో భాగంగా మెళుకువలను నేర్పించారు.



