లిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యం
ఫరీదాబాద్లో సామూహిక దారుణం
ఫరీదాబాద్ : ఢిల్లీ రాజధాని పరిధిలోని ఫరీదాబాద్ లో జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 ఏండ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను నిర్దాక్షిణ్యం గా రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను పట్టుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయివేట్ ఆస్పత్రి అంబులెన్స్లో నిందితులు ఈ నేరాన్ని చేసినట్లు విచారణలో తేలింది. ఈమేరకు సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు.
నమ్మించి వాహనంలోకి ఎక్కించిన నిందితులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 25ఏండ్ల యువతి సోమవారం సాయంత్రం ఫరీదాబాద్లోని సెక్టార్ 23లో ఉన్న తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చి వాహనం కోసం ఎదురుచూస్తుండంగా ఇంతలోనే ఓ వ్యాన్ అక్కడికి వచ్చింది. అందులో ఇద్దరు వ్యక్తులు ఇంటి వద్ద దిగబెడతామంటూ యువతిని నమ్మించి వాహనంలోకి ఎక్కించుకున్నారు. అయితే, ఆమెను తన ఇంటి వద్ద దింపకుండా వారు గురుగ్రామ్ వైపు వాహనాన్ని మళ్లించారు. కదులుతున్న వాహనంలోనే ఆమెపై లైంగికదాడి చేసినట్టు సమాచారం. ఆమెను రాత్రంతా వాహనంలో తిప్పి, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఫరీదాబాద్లోని రాజా చౌక్ సమీపంలో వ్యాన్లో నుంచి బయటకు విసిరేశారు.
వ్యాన్ కాదు ప్రయివేట్ అంబులెన్స్
ఈ ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత కూడా ఆ మహిళ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ఆ ఇద్దరిని ఉత్తర్ప్రదేశ్కు చెందిన మధుర, ఝాన్సీకి సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో వారిద్దరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దర్యాప్తులో భాగంగా ఈ ఘటనకు సంబంధించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఈ నేరాన్ని వ్యాన్లో కాకుండా ఒక ప్రయివేట్ ఆస్పత్రి అంబులెన్స్లో చేసినట్టు తెలిసింది. నిందితుల్లో ఒకరు ప్రయివేట్ ఆస్పత్రి అంబులెన్స్లో డ్రైవర్, మరొకరు హెల్పర్గా పనిచేసేవారని ఒక సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో
కాగా ఈ ఘటన తర్వాత బాధితురాలికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో తనపై జరిగిన దాడి గురించి స్పష్టంగా తెలిపింది. ఇంటికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తనకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి వాహనంలోకి ఎక్కించుకున్నారని చెప్పింది. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు తన ఖాతాలో రూ.600 జమ చేశారని ఆమె వివరించింది. నాకు వారు ఇంతకు ముందు తెలియదు. నేను కారులో కూర్చోగానే, వారిలో ఒకరు నా పేటీఎం ఖాతాకు రూ.600 బదిలీ చేశారు. ఆ తర్వాత వారు కారును లాక్ చేసి నా మొబైల్ను లాక్కున్నారు. రాత్రి దట్టమైన పొగమంచు ఉంది. నేను గట్టిగా అరిచాను, కానీ సహాయం లభించలేదు అని ఆమె ఆ వీడియోలో చెప్పింది. బాధితురాలు కోలుకున్న తర్వాత నిందితులను మరోసారి పరేడ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నట్టు పోలీసులు తెలిపారు.



