ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు : బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం
న్యూఢిల్లీ : చైనా పౌరుల కోసం భారత్ కొత్తగా ఈ-బీ-4 వీసాగా పిలవబడే ఈ-ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసాను ప్రారంభించింది. ఈ వీసా ద్వారా చైనా వ్యాపారవేత్తలు పరికరాల ఇన్స్టాలేషన్, కమిషనింగ్, నాణ్యత తనిఖీ, అవసరమైన నిర్వహణ, ఉత్పత్తి, ఐటీ, ఈఆర్పీ ర్యాంప్-అప్, శిక్షణ వంటి కార్యకలాపాల కోసం భారత్కు రావచ్చు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ వీసాను ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో తెలిపింది. దరఖాస్తుదారులు ఎంబసీ, ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ-బీ-4 వీసా సాధారణంగా 45-50 రోజుల్లో జారీ అవుతుందనీ, వీసా పొందినవారు గరిష్టంగా ఆరు నెలల పాటు భారత్లో ఉండేందుకు అనుమతి ఉంటుందని వివరించింది. చైనా పౌరులను ఆహ్వానించాలనుకు నే భారతీయ కంపెనీలు డీపీఐఐటీకి చెందిన నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) పోర్టల్లో నమోదు చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత దరఖాస్తుదారులు ‘ఇండియావీసా ఆన్లైన్.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇటీవలి కాలంలో భారత్-చైనా మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు రెండు దేశాలూ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకున్నది.



