– దేశానికే ఆదర్శంగా ఆయిల్ పామ్ సాగు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తా.. : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– సంక్రాంతి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన చిరకాల కోరిక అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతు మేళా కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత కుమార్ ఆధ్యక్షతన జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సహకారంతో ఏర్పాటుచేయబడిన ఈ వ్యవసాయ కళాశాల.. వ్యవసాయ విద్యలో ఉత్తమ కళాశాలగా నిలవాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ డీపీఆర్లో లేదని, ఈ ప్రభుత్వంలో ఆ కెనాల్స్కు నిధులు మంజూరు చేశారన్నారు. నాల్గో పంపు హౌస్ నిర్మాణంతో దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు గోదావరి నీళ్లు అందుతాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అగ్ర భాగాన ఉండాలన్నారు. సంక్రాంతి పండుగ రోజు నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులోకి వస్తుందన్నారు.
ఇరిగేషన్ మంత్రిగా మాట ఇస్తున్నా.. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సశ్యశ్యామలం చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాట ఇస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్ట్లు నిర్మాణం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు గోదావరి జలాలు కేటాయింపు సాధించామని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలి వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట కళాశాల అ, దానికి అనుసంధానంగా అకడమిక్ బ్లాక్, బాలుర వసతి గృహం కోసం నూతన భవన సముదాయాలు నిర్మించాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆయిల్ ఫెడ్ చైర్మెన్ జంగా రాఘవరెడ్డి, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మెన్ సుంకవల్లి వీరభద్రరావు, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ ఎన్.గోపి, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు ఆల్తాప్ జానయ్య, రాజారెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ జాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీతారామ ప్రాజెక్టుతో సస్యశ్యామలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



