– విద్యార్థుల భవిష్యత్ను బలిచేస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీ : మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనమని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ విద్యార్థుల భవిష్యత్తును బలి చేస్తున్నదని తెలిపారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంలో ఫెయిల్, పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింని విమర్శించారు. మొన్న పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం ఇంకా మరువకముందే, ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, ఏఐ పెన్లతో రాసిన మోడ్రన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోందని పేర్కొన్నారు. ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?అని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రలో మునిగి ఉందని తెలిపారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం, రెండేండ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యాసంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, రేవంత్రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనమని తెలిపారు. ‘కాదేదీ కవితకు అనర్హం’అని శ్రీశ్రీ అంటే, ‘కాదేదీ స్కాంకు అనర్హం’అని రేవంత్రెడ్డి చేసి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలనీ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



