నవతెలంగాణ- రాయపోల్
ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారెడ్డి బాల్ లక్ష్మీ, మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. శనివారం రాయపోల్, గజ్వేల్ ప్రాంతం నుంచి ఛలో సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారుల మహాసభకు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో ఉద్యమకారుల బతుకులు చిత్రమైపోయాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఉద్యమకారులకు 250 గజాలలో ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నెలకు 30 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది ఉద్యమకారులలో సగం మందికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల ఆర్థిక సాయం చేసిందని, మిగత ఉద్యమకారులకు ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. 100 ఎకరాలలో అమరవీరుల స్మృతిమనం ఏర్పాటు చేయాలన్నారు. అమరుల కుటుంబాలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యమకారులకు ఉచిత బస్సు పాసులు అందజేయాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు 50 శాతం సబ్సిడీతో కూడిన కోటి రూపాయల వ్యాపార నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలన్నారు.రాష్ట్ర సాధనలో కీలకపాత్ర వహించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించి సాంస్కృతిక పాలసీని ప్రకటించాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో అమరవీరులకు గుర్తుగా స్మారక భవనం నిర్మించాలన్నారు.
ఉద్యమకారులకు 20 లక్షల సామాన్య ప్రమాద బీమా సహకారం కల్పించాలన్నారు.ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కాబట్టి సూర్యపేటలో నిర్వహించే బహిరంగ సభకు తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివెళ్లడంజరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో టియు జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్ట రాజు, జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి స్వరూప, కో కన్వీనర్ సుదర్శన్, నాయకులు చిత్తార, సుధాకర్ రెడ్డి, మాణిక్య ప్రభు, భాస్కర్, మన్నే గణేష్, సొక్కం స్వామి, బొల్లం రాజేష్, సుధాకర్, కృష్ణ, ఎల్లమ్మ, లక్ష్మి, అనసూయ, శారద,భాగ్య, తదితరులు పాల్గొన్నారు.



