తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పు ఎలా..?
మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షం : ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: నీటి విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు తెలుగురాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాయలసీమకు నీరందించామనటానికి పట్టిసీమ ప్రత్యక్ష ఉదాహరణ అని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగానే ఉద్యానరంగం అభివృద్ధి చెందిందన్నారు. పూర్తిచేయకుండా 2020లోనే నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్తో స్వార్థరా జకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం మట్టిపనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి విషయంలో రాజీపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు.జగన్కు నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చేయరని చంద్రబాబు అన్నారు. సింధు నాగరకత ఎలా వచ్చిందో అతను తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు ఎక్కువగా నదీ తీరాల వెంబడి ఉండబట్టే అభివృద్ధి చెందాయని తెలిపారు. లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలూ నదీతీర ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. నదీ గర్భానికి.. నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చిమ్మటం మానట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నీటిని సద్వినియోగ చేసుకుంటున్నాం కాబట్టే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ది చెందిం దన్నారు. దేశంలోనే ఉద్యాన రంగంలో మొదటి స్థానంలో ఉన్నాం.. రానున్న పదేళ్లలో ప్రపంచం లోనే నెంబర్ వన్ స్థానానికి వెళ్తామని పేర్కొన్నారు.
నీటి కోట్లాలతో నష్టపోయేది తెలుగు ప్రజలే
- Advertisement -
- Advertisement -



