మిల్లు సీసీఐ అధికారుల కుమ్మక్కుతో దళారులకు లాభం
మరో పక్క ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టే విధంగా ట్రేడ్ లైసెన్సు లేకుండానే దళారుల దందా
చోద్యం చూస్తున్న అధికారులు..
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల లోని రేగులాగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల రుద్రా జిన్నింగు మిల్లులో దళారులు మిల్లు యాజమాన్యులు సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులకు నష్టం చేసే విధంగా కమిషన్ల కోసం తరువు పేరు మీద రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి అత్కూరి శ్రీకాంత్ అన్నారు.
సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు అర్జీ సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 5 కిలోల నుంచి పది కిలోల తరుగు తీస్తూ ఆరుకాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంటకు అర్థం లేకుండా అధికారులు, మిల్లర్లు దళారుల జేబుల్లో మాత్రం ధనం అనే విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందచేశారు.
ఇప్పటివరకు ఇసుమంత కూడా విచారణ జరగలేదని దీన్ని బట్టి చూస్తే రైతుల పట్ల జిల్లా స్థాయి నుండి కింది స్థాయి అధికారుల వరకు ఎంత నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారనేది అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రైతన్నకు కష్టం కలిగించకుండా రుద్ర జిన్నింగ్ మిల్లుపై, సీసీఐ అధికారులపై సమగ్ర విచారణ జరిపి దళారులతో సహా అందరిపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగం మీద నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.



