– అక్రమార్కుల భరతం పడతాం
– రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు
– పేదలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు : రెవెన్యూ మంత్రి పొంగులేటి
– కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భూకబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అక్రమార్కుల భరతం పడతామని చెప్పారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలంలో ఎస్ఎస్ఆర్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తోందని చెప్పారు. ప్రజలకు సౌకర్యం, పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తున్నామని అన్నారు. మొదటి విడతలో ఔటర్రింగ్రోడ్డు పరిధిలో రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో, మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాల్లో సమీకృత భవనాలను నిర్మిస్తామని వివరించారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమి ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) భవనంలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ భవనాలను నిర్మించే సంస్థలే ఐదేండ్లపాటు వాటిని నిర్వహించాలని కోరారు. కొత్తగా పెండ్లయి రిజిస్ట్రేషన్కు వచ్చే జంటలు, చిన్న పిల్లలతో వచ్చే తల్లులు, పేదలకు సకల సౌకర్యాలుంటాయని వివరించారు. రెండేండ్లుగా ఖజానాకు డబ్బు చేకూరాలనే ఆలోచన కాకుండా పేదలను దృష్టిలో ఉంచుకుని అనేక సంస్కరణలను తెచ్చామన్నారు. పేదలకు ఇచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉక్కుపాదంతో అక్రమాలను అణచివేస్తామన్నారు. ఒకప్పుడు పేదలకు పంపిణీ చేసిన భూములను, అసైన్డ్ భూములను ఒకవేళ ప్రభుత్వం తీసుకోవాలనుకున్నా వారికి తగిన పరిహారం, ప్రత్యామ్నాయ స్థలం మంజూరు వంటి చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. త్వరలో జరగబోయే మేడారం జాతర కోసం భారీ నిర్మాణాలతో ఆధునీకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రావు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్, ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్న డీఎస్ఆర్ నిర్మాణ సంస్ధ అధినేత సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూకబ్జాలపై ఉక్కుపాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



