Tuesday, January 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమున్సిపల్‌ ఎన్నికల్లో ప్రలోభాలను తిప్పికొట్టండి

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రలోభాలను తిప్పికొట్టండి

- Advertisement -

ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి
ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్న మోడీ : చౌటుప్పల్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలకు ఓటర్లు లొంగకుండా తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపల్‌ కేంద్రంలో గట్టు శ్రీరాములు గార్డెన్‌లో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు ఎండి పాషా, అవ్వారి రామేశ్వరి, అధ్యక్షతన సోమవారం మున్సిపల్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. దేశంలో దోపిడీ, పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ సంస్థలు బలమైన శక్తిగా కొనసాగుతున్నాయని, పాలకులు కూడా వారికి అనుకూలంగా విధానాలను రూపొందిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పెట్టుబడిగా పెట్టి గెలుపే లక్ష్యంగా పాలక పార్టీలు ముందుకొస్తాయని, వాటిని ప్రజలు తిప్పి కొట్టాలని సూచించారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం.. శ్రామిక, కర్షకుల పక్షాన పోరాటాలు నిర్వహించే సీపీఐ(ఎం) అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు.

నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ.. ఉద్యమాలు నడిపించే నాయకులకు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు. గత సర్పంచ్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై కమ్యూనిస్టు నాయకులను ఓడించాలని చూసినా ప్రజల అండతో అనేకచోట్ల సీపీఐ(ఎం) బలపర్చిన అభ్యర్థులు గెలిచారని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని చెప్పారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ప్రపంచ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే.. దేశ ప్రధాని మోడీ మాత్రం ట్రంప్‌ను సంతోషపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలు అన్నింటినీ ప్రయివేటుపరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పేరు మార్చడంతోపాటు నిధులు తగ్గించారన్నారు. మరోవైపు దేశంలో బీజేపీ మతోన్మాద భావజాలాలను పెంచుతూ.. ప్రజల మధ్య చిచ్చు రాజేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

గ్రామాల్లో బీజేపీ మతోన్మాద భావజాలం : చెరుపల్లి
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. గ్రామాల్లో బీజేపీ మతోన్మాద భావజాల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచమంతా శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటే మన దేశంలో మూఢాచారాలకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.

గ్రామాలకు నిధులు కేటాయించాలి : జహంగీర్‌
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్‌ మాట్లాడుతూ.. సర్పంచులు గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నా, అభివృద్ధికి పాటుపడాలన్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని కోరారు. కమ్యూనిస్టులు గెలిచిన చోట నిస్వార్థంగా, గ్రామాలు, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన చరిత్ర ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల మధ్యన ఉండే కమ్యూనిస్టులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అంతకుముందు కామ్రేడ్‌ భూపాల్‌రెడ్డి చిత్రపటానికి జోహార్లు అర్పించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మున్సిపల్‌ కార్యదర్శి గోశిక కరుణాకర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌, శ్రీనివాసచారి, యాదిరెడ్డి, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, దండా అరుణ్‌ కుమార్‌, గోపగోని లక్ష్మణ్‌, తొర్పునూరు మల్లేశం, గోసిక స్వామి, గుర్రం నరసింహ, కందగట్ల ఆనంద్‌, ఉష్కావుల రమేష్‌, బొడ్డు అంజిరెడ్డి, కామిశెట్టి ప్రభాకర్‌, జయమ్మ, ధర్మారెడ్డి, దశరథ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -