– హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ
హైదరాబాద్ : మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన 15వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం సికింద్రాబాద్ క్లబ్లో ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 300కు పైగా క్రీడాకారులు పోటీపడిన ఈ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ (30 ప్లస్) విజేతగా అనురుధ్, సిద్దార్థ్ జోడీ నిలిచింది. టైటిల్ పోరులో విజయానంద్, కన్నన్లపై 10-8తో గెలుపొందిన అనురుధ్, సిద్దార్థ్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. 30 ప్లస్ సింగిల్స్లో మంజునాథ్పై కన్నన్ 10-9 (7-4)తో గెలిచి టైటిల్ సాధించాడు. 40 ప్లస్ డబుల్స్లో ఎల్. శ్రీనివాస్, వాహీద్లు 10-7తో బోస్ కిరణ్, అప్రోజ్లపై నెగ్గగా.. సింగిల్స్లో అఫ్రోజ్ 10-3తో రజాపై గెలుపొంది విజేతగా నిలిచారు. 50 ప్లస్ డబుల్స్లో మణికందన్, కెవిఎన్ మూర్తి జోడీ 10-2తో నంద్యాల నర్సింహారెడ్డి, నీల్కాంత్లపై గెలుపొందారు. సింగిల్స్లో నీల్కాంత్ 10-0తో మణికందన్పై ఏకపక్ష విజయం నమోదు చేశారు. మెహర్ ప్రకాశ్, అంకయ్యలు వరుసగా 60, 70 ప్లస్ సింగిల్స్లో విజేతగా నిలువగా.. డబుల్స్లో ఆనంద్ స్వరూప్, శ్రీనివాస్.. అంకయ్య, గజపతి జోడీలు చాంపియన్లుగా నిలిచాయి. నార్త్ జోన్ ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, మిస్ ఆసియా రష్మి ఠాగూర్, తుమటి వెంకట నరసింహారెడ్డి, హెచ్ఓటీఏ అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.