నవతెలంగాణ-మద్నూర్
దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ అనేది కేవలం భ్రమ మాత్రమేనని, బీజేపీని నిజంగా ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని మద్నూర్ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అభిషేక్ పటేల్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వం వంటి విభజన రాజకీయాల ద్వారా బీజేపీ తన బలం పెంచుకుందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను బలహీనపరచడానికి ఎక్కువ శ్రమించాయని, అదే బీజేపీ ఎదుగుదలకు కారణమైందని విమర్శించారు.
గతంలో కాంగ్రెస్ను తక్కువగా అంచనా వేసిన పార్టీలు ప్రస్తుతం అవే తమ ఉనికి కోసం పోరాడుతున్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్లో బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పోరాటమేనని తెలిపారు. బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలు అహంకార రాజకీయాలను విడిచిపెట్టి కాంగ్రెస్తో కలిసి నడవాలని అభిషేక్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ ను చిన్నచూపు చూస్తూ థర్డ్ ఫ్రంట్ పేరుతో రాజకీయం చేస్తే, ఆ పార్టీలు చరిత్రలో కలిసిపోవడం తప్పదన్నారు. దేశాన్ని రక్షించాలంటే, ప్రజాస్వామ్య విలువలను కాపాడే శక్తులు ఒక్కటిగా నిలవాలి అని ఆయన తెలిపారు.



