గత ప్రభుత్వ టారీఫే కొనసాగింపు
ధరలు తగ్గించామని ప్రచారం
ప్రతి నెల 40పైసల బాదుడు కొనసాగింపు
అమరావతి : విద్యుత్ ఛార్జీలను, కొనుగోలు ధరను తగ్గించామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. పస్తుతం సరాసరి యూనిట్ ధర రూ.5.50లకుపైనే డిస్కమ్లు కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రూ.4.90లకే కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తోంది. దీనికి భిన్నంగా ఉన్న వాస్తవ పరిస్థితులపై విద్యుత్ అధికారులు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ధర తగ్గిందని చెబుతున్న ప్రభుత్వం అ దే సమయంలో వినియోగదారుల నుంచి ఎఫ్పీపీసీఏ పేరుతో ప్రతి నెల 40పైసలు వసూలు చేస్తున్న విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ప్రచారమే నిజమైతే ఈ మొత్తం ఎందుకు వసూలు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపడంలో వైసీపీ, కూటమి ప్రభుత్వాలు రెండు ఒకే విధంగా ఉన్నాయి. ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ పేరుతో వినియోగదారులపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ టారీఫ్లో శ్లాబుల విధానం మార్చి వినియోగదారులపై పెద్దఎఒత్తున భారం మోపడమే కాకుండా ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ పేరుతో సుమారు రూ.30వేల కోట్ల భారాన్ని వేసింది. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు సుమారు రూ.18వేల కోట్ల భారాన్ని మోపింది. గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఉన్న టారీఫ్నే కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇవే అంశాలను నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
అనుమతి ఇచ్చిన దానికంటే అదనంగా కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీి) అనుమతి ఇచ్చిన ధర కంటే డిస్కమ్లు అదనంగా విద్యుత్ను కొనుగోలు చేస్తున్నాయి. సరాసరి యూనిట్ ధర రూ.4.80లకు కొనుగోలు చేస్తామని 2025-26 ఆర్ధిక సంవత్సరం వార్షిక ఆదాయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కమ్లు ప్రతిపాదించాయి. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతిపాదించిన దానికంటే యూనిట్కు సుమారు రూ.2ల చొప్పున అదనంగా కొనుగోలు చేస్తు న్నాయి. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్్) నవంబర్లో యూనిట్ విద్యుత్ ధర కొనుగోలు అనుమతి రూ.5.41లకే ఉన్నా రూ.5.88లకు కోనుగోలు చేసింది. ఇక ప్రతి నెల ఎఫ్పీపీసీఏ పేరుతో 40 పైసలును వినియోగదారుల నుంచి వసూలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎపిఇపిడిసిఎల్) నవంబర్లో సరాసరి యూనిట్ ధర రూ.5.37లకు అనుమతి ఉంటే రూ.5.85ల చొప్పున కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎపిఎస్పిడిసిఎల్) నవంబర్లో యూనిట్కు రూ.5.39లకు కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంటే రూ.5.85లకు కొనుగోలు చేసింది. ఇప్పటికే ప్రతి నెల ఎఫ్పిపిసిఎ చార్జీలు కింద యూనిట్కు 40పైసల చొప్పున డిస్కమ్లు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు వసూలు చేస్తుంది కాకుండా మరలా ఏడాది చివరిలో వసూలు చేసే అవకాశం ఉంది. ప్రతిపాదించిన యూనిట్ కంటే అదనంగా కొనుగోలు చేస్తున్న డిస్కమ్లు మరో పక్క 2026-27 ఎఆర్ఆర్ లో కూడా వాస్తవ పరిస్థితులకు దూరంగా కొనుగోలు ధరను చూపించి యూనిట్ను రూ.4.60ల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించింది.
అదనపు వసూలును ట్రూడౌన్ పేరుతో వెనక్కి
విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన దాని కంటే అదనంగా వసూలు చేసి ట్రూడౌన్ పేరుతో వెనక్కి ఇస్తున్నాయి. 2024-25 సంవత్సరంలో ఎఫ్పిపిసిఎ పేరుతో ప్రతి నెల యూనిట్కు 40పైసల్ చొప్పున మూడు పంపిణీ సంస్థలు రూ.2,787కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశాయి. ఇపిడిసిఎల్ మిగులులో ఉన్నా 40 పైసలు చొప్పున ఆ సంస్థ వినియోగదారుల నుంచి రూ.1,065.76 కోట్లు వసూలు చేసింది
విద్యుత్ కొనుగోలులో నిజమేది?
- Advertisement -
- Advertisement -



