సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లయినా ఉపేక్షించం
లక్కీ డ్రాల ఇన్ఫ్లుయెన్సర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సోషల్ మీడియా క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకుని, ‘లక్కీ డ్రా’ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఆయన స్పందించారు. గతంలో బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన కొందరు, ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పడటంతో ఇప్పుడు ‘లక్కీ డ్రా’ల అవతారమెత్తారని సీపీ తెలిపారు. కార్లు, ఖరీదైన బైకులు, ఇండ్లు, డీజే సెట్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రజలకు ఎర వేసి, నిలువునా మోసం చేస్తున్నారని చెప్పారు.
రీల్స్లో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ, వాస్తవంలో మోసాలకు పాల్పడుతున్న పలువురు ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలను సీపీ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై ‘ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ – 1978’ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో వారు సినిమా సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లయినా సరే, చట్టపరమైన చర్యల నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. లక్కీ డ్రాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఇందుకోసం డయల్ 100కు, హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సప్ నెంబర్ 94906 16555కు వివరాలు పంపించాలని సూచించారు. స్థానిక పోలీసులకూ ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రలోభాలకు గురిచేసే మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
రీల్స్లో హడావుడి..రియాలిటీలో గారడీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



