Sunday, January 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసైనిక చర్యలు జరుగుతున్నాయి… జాగ్రత్త

సైనిక చర్యలు జరుగుతున్నాయి… జాగ్రత్త

- Advertisement -

దేశీయ విమాన సంస్థలకు అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్‌ : మెక్సికో సమీపంలోని తూర్పు పసిఫిక్‌లో, మధ్య అమెరికాలో, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని దేశీయ విమాన సంస్థలను అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) హెచ్చరించింది. ఆయా ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపింది. విమానం ఎంత ఎత్తులో ఎగురుతున్నప్పటికీ ముప్పు ఎదురు కావచ్చునని, విమానాలు వచ్చే సమయంలోనూ, తిరిగి వెళ్లే సమయంలోనూ కూడా అప్రమత్తత అవసరమని చెప్పింది.

ఈ హెచ్చరిక 60 రోజుల పాటు అమలులో ఉంటుంది. సమీపంలో ఎక్కడైనా ఘర్షణలు, దాడులు జరుగుతున్నప్పుడు లేదా ఆ అవకాశం ఉన్నప్పుడు ఎఫ్‌ఏఏ ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. కరేబియన్‌ సముద్రంలోనూ, తూర్పు పసిఫిక్‌లోనూ నౌకలపై అమెరికా దళాలు సుమారు నాలుగు నెలల పాటు దాడులు చేశాయి. వాటిలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. మొత్తంమీద 35 నౌకలపై జరిపిన దాడులలో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. వెనిజులా గగనతలంపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎఫ్‌ఏఏ గత నవంబరులో తన పైలట్లకు హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -