Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా శక్తికి దర్పణం

మహిళా శక్తికి దర్పణం

- Advertisement -

– మహిళలు కేవలం గృహిణులు కాదు,  కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తున్న ఆర్థిక యోధులు
– ఐకేపీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నవతెలంగాణ –  కామారెడ్డి

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్  షబ్బీర్ అలీ అన్నారు. ఇందుకు ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సంఘాల కృషి వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని కళాభారతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన  అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ  గతంలో మహిళలు కేవలం గడప దాటడానికే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.  ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రారంభమైన ఐకేపీ కార్యక్రమం ద్వారా నేడు మహిళలు స్వయం ఉపాధితో లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారని తెలిపారు.

“మీరు కేవలం గృహిణులు కాదు. కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తున్న ఆర్థిక యోధులు” అంటూ మహిళలను ఆయన ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి పూర్తిగా కట్టుబడి ఉందని, గతంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో మహిళలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామగ్రామాన తిరుగుతూ మహిళలను సంఘటితం చేస్తున్న ఐకేపీ సిబ్బంది సేవలు అభినందనీయమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఈ డైరీ, క్యాలెండర్ కేవలం తేదీలను గుర్తు చేసే సాధనమే కాకుండా, రాబోయే ఏడాదిలో ఐకేపీ సాధించబోయే విజయాలకు సూచికగా నిలవాలని ఆకాంక్షించారు.

కామారెడ్డి తన సొంత గడ్డని పేర్కొన్న షబ్బీర్ అలీ, ఇక్కడి ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం ఎంతైనా కష్టపడతానని ఉద్వేగంగా తెలిపారు. ఐకేపీ కార్యాలయాల భవన నిర్మాణాలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -